భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు బేఖాతరు చేస్తూ వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా శ్రద్ధ చూపడం లేదు. గాలి, వెలుతురు లేని ఎౖతైన, ఇరుకుగదుల్లో వందలాది మంది విద్యార్థులను కూర్చోబెట్టి క్లాసులు నిర్వహిస్తుండడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కూడా పట్టించుకోవడం లేదు. అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణకు అవసరమైన భద్రతా ప్రమాణాలను కూడా పట్టించుకోవడం లేదు. ఇదంతా తెలిసినా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
75 ప్రైవేట్ పాఠశాలలు..
జిల్లావ్యాప్తంగా 75కు పైగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. సుమారు 20వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో అధికశాతం ఇరుకు గదుల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కనీస వసతులు కరువు..
జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 300 మొదలుకుని వెయ్యికి పైగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలల్లో కూడా నాలుగైదు మరుగుదొడ్లతోపాటు తొమ్మిది పది మూత్రశాలలు ఉన్నాయి. పాఠశాల విరామ సమయంలో వాటి ముందు పిల్లలు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. కొంతమంది బాలికలు బాత్ రూముల సమస్యతో తగినంత నీరుతాగడం మానేస్తున్నట్లు కూడా తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు తాగేందుకు సరిపడా నీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఇరుకుగదుల్లో ప్రైవేట్ పాఠశాలల తరగతుల నిర్వహణ
కార్పొరేట్ ఫీజులు.. వసతులు జీరో
కనీస నిబంధనలు పాటించని యాజమాన్యాలు
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
నిబంధనలు గాలికి..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపకశాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే అనుమతించాలి. కానీ కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా మామూళ్లకు అలవాటు పడి, రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడితో అటు, ఇటుగా ఉన్నా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తరువాత రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


