రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ
రేగొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నకిలీ ఓటర్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక, చెన్నాపూర్ గ్రామాలలో ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజ్యలక్ష్మి, బీఎల్ఓ సూపర్వైజర్ రాజయ్య, వెంకటేష్, బీఎల్ఓలు పాల్గొన్నారు.
100శాతం ఉత్తీర్ణత
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో జిల్లా వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేశ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 58 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 41 మంది బాలురు, 17 మంది బాలికలు ఉన్నారు. హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు.
లారీ అసోసియేషన్
అధ్యక్షుడిగా వేణుగోపాల్
భూపాలపల్లి అర్బన్: దీ కాకతీయ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా పులి వేణుగోపాల్, ఉపాధ్యక్షుడిగా కౌటం సురేందర్, ప్రధాన కార్యదర్శిగా బొంతల రాజు, సహాయ కార్యదర్శిగా మేకల శ్రావణ్, కోశోధికారిగా చిత్తారి రాకేశ్ ఎన్నికయ్యారు.
29నుంచి రిలే నిరాహార దీక్షలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 29వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సీఎంఓఏఐ భూపాలపల్లి ఏరియా అధ్యక్షుడు నజీర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట అధికారులు నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండీ నజీర్ మాట్లాడుతూ.. కోలిండియా లిమిటెడ్లో అమలవుతున్న పే అప్గ్రేడేషన్ను సింగరేణి అధికారులకు కూడా అమలు చేయాలని కోరారు. కోలిండియాలో చెల్లిస్తున్న అన్ని భత్యాలు, పే అప్గ్రేడేషన్, పీఆర్పీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ నాయకులు శ్యాంసుందర్, జోతి, అరుణ్, ట్రెజరర్ సాయికృష్ణ, మన్నాన్, చంద్రశేఖర్, మిర్జా యాసిన్ బేగ్, శ్రీనాథ్, సమ్మిరెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.
మూసివేత ప్రయత్నాలను విరమించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ.లింగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన డీటీఎఫ్ జిల్లా నాల్గవ వార్షిక కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
జిల్లా అధ్యక్షుడిగా సీహెచ్ అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎ.తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్రెడ్డి, సునీత, బి.తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శులుగా వీరేశం, బొజ్జనాయక్, ఎస్.వీరన్న, సీహెచ్ ప్రభాకర్, రాష్ట్ర కౌన్సిలర్లుగా పలువురు ఎన్నికయ్యారు.


