● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: ప్రత్యేక సవరణ కార్యక్రమం 2026లో భాగంగా ఓటరు అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమాల కింద 2కే రన్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేడు(బుధవారం) ఉదయం 7.30 గంటలకు ఇల్లందు క్లబ్ హౌస్, మంజూర్ నగర్ నుంచి ఐడీఓసీ కార్యాలయం వరకు 2కే రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లలో ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించడం, ఓటు హక్కు వినియోగంపై చైతన్యం కల్పించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రన్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల జిల్లా అధికారులకు బాధ్యతలు కేటాయించామన్నారు. జిల్లాలోని యువత, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.
పాఠశాలల
బంద్ విజయవంతం
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, విద్యా హక్కు చట్టం అమలు, ప్రైవేట్–కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ నియంత్రణ వంటి డిమాండ్ల సాధన కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గుజ్జుల ప్రేమ్కుమార్ తెలిపారు. ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను నిలిపివేయడంతో పాటు ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు ప్రత్యేక ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, విద్యా హక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పర్మిషన్ లేని పాఠశాలను సీజ్ చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న బిట్స్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకుని సీజ్ చేయాలని, పాఠశాల చైర్మన్ రాజేంద్రప్రసాద్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్కు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాత గుడ్ మార్నింగ్ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న బిట్స్ పాఠశాలకు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు లేవని ఆరో పించారు. అయినప్పటికీ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను, అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తోందని విమర్శించారు. అనుమతులు లేకుండా విద్యాసంస్థలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, డబ్బేట శరత్, రాజుల శివ, ఉల్లెరవు రావు బన్నీ, పవన్, రాజేష్, నవీన్ పాల్గొన్నారు.
గోడకూలి మహిళకు
గాయాలు
టేకుమట్ల: గోడకూలి మహిళకు గాయాలైన ఘటన మండలంలోని కుందనపల్లిలో చోటుచేసుకుంది. కుందనపల్లిలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో మాడుగుల రమ్యకు చెందిన ఇంటి గోడ కూలి ఆమైపె పడింది. ఈ ప్రమాదంలో రమ్య రెండు కాళ్లతో పాటు పాదానికి తీవ్ర గాయమైంది. ఆమె కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


