జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం
భూపాలపల్లి రూరల్: జిల్లాలో వనమహోత్సవంలో భాగంగా నాటనున్న మొక్కల లక్ష్యాన్ని జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. 2026–27 సంవత్సరానికిగాను జిల్లా వ్యాప్తంగా 2,51,814 మొక్కలు నాటాలని నిర్ణయించింది. డీఆర్డీఓ, మున్సిపల్, అటవీశాఖల ఆధ్వర్యంలోని నర్సరీల్లో మొక్కలు పెంచే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటినుంచి జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో అధికారులు నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకానికి అవసరమైన కసరత్తు ప్రారంభించారు. జూన్ నాటికి మొక్కలు సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారు. వేసవి ప్రారంభమై ఎండలు ముదురుతున్న నేపద్యంలో మొక్కల సంరక్షణకు గ్రీన్ షెడ్ కట్టే పని చేపట్టారు.
జిల్లాలో 2,51,814 లక్షల మొక్కలు..
జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా జిల్లాలోని 248 గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల చెరువుల నుంచి మట్టి తీసుకు వచ్చి పాలిథిన్ బ్యాగుల్లో నింపుతున్నారు. మరికొన్ని చోట్ల మట్టి నింపి విత్తనాలు కూడా నాటారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఆ శాఖకు అవసరమైన మొక్కలతో పాటు ఇతర శాఖలకు కూడా అందించేలా మొక్కలను పెంచే దిశగా చర్యలు ప్రారంభించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతుంది
జూన్ మాసం వరకు..
డీఆర్డీఓ ఆధ్వర్యంలో మండలాల వారీగా జిల్లా వ్యాప్తంగా 2,51,814 మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా అటవీ, మున్సిపల్ శాఖ లకు లక్ష్యం నిర్ధేశించిన ప్రభుత్వం.. మిగతా శాఖ లకు సుమారు లక్ష వరకు మొక్కలు నాటించే విధంగా లక్ష్యాలను కేటాయించారు. వచ్చే జూన్లో లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాల్సిఉంది.
పండ్లు, నీడనిచ్చే మొక్కలు..
హరితహారంలో ప్రజలు ఎక్కువగా కోరుకునే మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చారు. పండ్లు, నీడనిచ్చే మొక్కలతో పాటు, బాదం, వేప, కానుగ, చింత, మామిడి, జామ, ఉసిరి, నిమ్మ, దానిమ్మ, గులాబీ, మందార, మల్లె తదితర మొక్కలను నర్సరీల్లో పెంచనున్నారు. సింగరేణి, తాడిచెర్ల ఏఎంఆర్ మైనింగ్శాఖలు నిర్ధేశించిన మొక్కలతో పాటు అదనంగా పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. జూన్ నెలలో మొక్కలు నాటే విధంగా పెంపకం జరుగుతుంది. మొక్కలను లక్ష్యానికి అనుగుణంగా పెంచుతాం.
– బాలకృష్ణ, డీఆర్డీఏ
వివిధశాఖల ఆధ్వర్యంలో
నర్సరీల ఏర్పాటు
మొక్కల పెంపకానికి కసరత్తు షురూ


