భూపాలపల్లి: ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలు కార్యాచరణ అమలుపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, సంక్షేమ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై విపులంగా దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాలపై మండలాల వారీగా నివేదికలు, అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాల వివరాలు, మరమ్మతు, విద్యుత్, మంచినీటి సమస్యలపై మండలాల వారీగా నివేదికలు సమర్పించాలన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి 60 రోజుల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల పూర్తి, మహిళా సంఘాల్లో నమోదు కాని సభ్యులను నమోదు చేయాలన్నారు. గ్రామపంచాయతీ, విలేజ్ ఆర్గనైజేషన్ స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలను త్వరగా పూర్తి చేయాలని, బ్యాంకర్లను సమన్వయం చేస్తూ రుణ మేళాలను నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు సంక్షేమ గృహాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రూ. 500కే గ్యాస్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ తదితర పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి గ్రామసభల్లో చదివి వినిపించాలన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


