
వైరల్ ఫీవర్స్
న్యూస్రీల్
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025
జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
భూపాలపల్లి: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో జ్వర పీడితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. చిట్యాలలో 17 టైఫాయిడ్, 3 డెంగీ కేసులు, కాళేశ్వరంలో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. వైరల్ ఫీవర్స్తో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుండడంతో రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఆస్పత్రుల్లో పెరిగిన ఓపీ..
జ్వరాలు విజృంభిస్తుండటంతో జిల్లా ప్రధాన ఆస్పత్రి, చిట్యాల, మహదేవపూర్ ఆస్పత్రుల్లో ఓసీల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. జిల్లా ప్రధాన ఆస్పత్రికి మంగళవారం సాయంత్రం వరకు 522 ఓపీ రాగా, 193మంది జనరల్ మెడిసిన్ వైద్యుడిని సంప్రదించారు. ఇందులో వంద మందికి పైగా జ్వర పీడితులే ఉన్నారు. బాధితులందరికీ రక్త పరీక్షలు చేయగా ముగ్గురికి ప్లేట్లెట్ కౌంట్ తగ్గినట్లుగా గుర్తించి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. మిగిలిన వారికి మాత్రలు ఇచ్చి పంపారు. మహదేవపూర్ సీహెచ్సీలో సైతం అదే పరిస్థితి నెలకొంది. ఆస్పత్రికి జ్వర పీడితులే ఎక్కువగా వస్తున్నారు. కాళేశ్వరం ముగ్గురికి డెంగీ పాజిటివ్ రాగా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి చికిత్స పొందుతున్నారు.
ఆందోళనలో ప్రజలు
చిట్యాల సివిల్ ఆస్పత్రికి జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ నెల 14వ తేదీ నుంచి మంగళవారం వరకు వచ్చిన జ్వర పీడితులకు పరీక్షలు చేయగా 17 మందికి టైఫాయిడ్, ముగ్గురికి డెంగీ సోకినట్లుగా వైద్యులు గుర్తించి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నారు. డెంగీ కేసులు నమోదు అవుతుండటంతో చిట్యాల, సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వైరల్ ఫీవర్స్కూ తగ్గుతున్న ప్లేట్లెట్ కౌంట్..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్న జ్వర బాధితుల్లో నూటికి 80 మందికి ప్లేట్లెట్ కౌంట్, తెల్ల రక్తకణాలు తగ్గినట్లుగా రక్త పరీక్షల ద్వారా వైద్యులు గుర్తిస్తున్నారు. డెంగీ, టైఫాయిడ్ కాకుండా వైరల్ ఫీవర్స్కు కూడా ప్లేట్లెట్ తగ్గుతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
వైద్యులను సంప్రదించాలి..
తలనొప్పి, వణుకు, చలి, శరీరం ఒక్కసారిగా వేడెక్కడం లాంటి లక్షణాలతో జ్వరం వస్తే తప్పకుండా ఆస్పత్రికి రావాలి. రెండు రోజులుగా జిల్లా ఆస్పత్రికి జ్వర పీడితులు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారిలో డెంగీ కేసులు ఏమీ లేవు. వైరల్ ఫీవర్స్తో ప్లేట్లెట్ కౌంట్ తగ్గినట్లుగా గుర్తించాం. సాధారణ జ్వరంతో కౌంట్ తగ్గినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే జ్వరం తగ్గుతుంది.
– రాజేంద్రప్రసాద్,
జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిట..
జిల్లా ప్రధాన ఆస్పత్రితో పాటు భూపాలపల్లి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులు సైతం కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో గతంలో రోజుకు ఒక్కో జనరల్ ఫిజీషియన్ 30నుంచి 40 ఓపీ చూడగా ఇప్పుడు ఆ సంఖ్య 60 నుంచి 80కి పెరిగింది. జర్వ పీడితులే ఎక్కువగా వస్తుండటంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న వారిని అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నారు.
చిట్యాలలో 17 టైఫాయిడ్, 3 డెంగీ కేసులు
కాళేశ్వరంలో ముగ్గురికి డెంగీ
తగ్గుతున్న ప్లేట్లెట్ కౌంట్
జిల్లా ఆస్పత్రి, మహదేవపూర్, చిట్యాల సీహెచ్సీలకు పెరుగుతున్న ఓపీ

వైరల్ ఫీవర్స్

వైరల్ ఫీవర్స్

వైరల్ ఫీవర్స్