● కలెక్టర్ సందీప్కుమార్ఝా
స్టేషన్ఘన్పూర్: రైతులు కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక ఆదాయం పొందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో రైతు పిట్టల రాజుకు చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. పిట్టల రాజు చేస్తున్న దొండ, సొరకాయ, పొట్లకాయ సాగును పరిశీలించారు. పందిళ్ల విధానంలో ఏర్పాటు చేసిన తోటను పరిశీలించి తోట నిర్వహణ తీరు, పంట పెరుగుదల, నీటి వినియోగం, దిగుబడి తదితర వివరాలను రైతును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా తోటను బాగా నిర్వహిస్తున్నారని రైతును అభినందించారు. అనంతరం పొలంలో ఉన్న పత్తి పంటను పరిశీలించి పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఉద్యానశాఖ అధికారి సందీప్ తదితరులు ఉన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు..
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన చాంబర్లో చేయూత పింఛన్ల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పింఛన్లపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు మొదటి విడతలో సుమారు 7,500 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తు ఫారాలను చేయూ త వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ నూరుద్దీన్, డీపీఎం సతీష్, అడ్మిన్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


