జనగామ: జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంతో పాటు సంతోషిమాత ఆలయం, బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గ మాత ఆలయం, ఉప్పలమ్మ ఆలయం తదితర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవార్లను శాకంబరీ అలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించగా, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
కేసీఆర్ను కలిసిన
ఎమ్మెల్యే పల్లా
జనగామ: గురుపౌర్ణమి పురస్కరించుకుని బుధవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసే క్రమంలో తనకు మార్గదర్శకత్వం వహించిన పరిశోధనా గురువు ప్రొఫెసర్ కె.రామారెడ్డితో పాటు, ప్రోత్సహించిన ప్రొఫెసర్లు తన విద్యాజీవితానికి బలమైన పునాదులు వేసినట్లు స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రజాసేవ దిశగా నడిపించిన గురువు తెలంగాణ సాధకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: విద్యార్థులకు చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని జూని యర్ సివిల్ జడ్జి జి.శశి సూచించారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని పెంబర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ..విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలన్నారు. చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రవీంద్ర, పారా లీగల్ వలంటరీ బి.శేఖర్, పి. జితేంద్ర, ఇన్చార్జ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
నర్మెట: సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రాజామహేంద్ర నాయక్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను, స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఎస్హెచ్ఓ నైనాల నగేష్కు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీసీపీ వెంట స్టేషన్ ఘన్పూర్ ఏసీపీ, జనగామ ఇన్చార్జ్ భీం శర్మ ఉన్నారు.
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు సలహాలు, సూచనలు స్వీకరించడానికి డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్–1 డిపో కార్యాలయం నుంచి డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలివ్వాలని కోరారు.
980 కేజీల కల్తీ పన్నీరు పట్టివేత
మేడిపల్లి: నాణ్యత లేని పన్నీరును తరలిస్తున్న ముఠాపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ నారపల్లి రోడ్డు నందనవనం పార్కు సమీపంలో రెండు స్కార్పియో వాహనాల్లో తరలిస్తున్న నాణ్యత లేని పన్నీరు ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పెంబర్తి, పోచన్నపేటలకు చెందిన చామకూరి రాంరెడ్డి, జూల శ్రీనివాస్ కల్తీ పన్నీరు తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 980 కేజీల పన్నీరు స్వాధీనం చేసుకొని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.


