● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రఘునాథపల్లి: కరువు ఉన్నా.. నీళ్లు ఇచ్చే బాధ్యత నాది.. మీరు (రైతులు) నార్లు పోసి నాటు వేయండి.. అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శని వారం మండలంలోని మండలగూడెంలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి, రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించుకున్న లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి జలాలను తరలించి బొమ్మకూరు రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి మండలగూడెం, ఇతర చెరువులను నింపి పంటలకు సాగు నీరు అందిస్తామన్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, మండల అధ్యక్షుడు గాదె మహేందర్రెడ్డి, బొనాసి క్రాంతికుమార్, లింగాజి, బొనాసి కొమురయ్య, నామాల బుచ్చయ్య, కోళ్ల రవిగౌడ్, గొరిగ రవి, తదితరులు పాల్గొన్నారు.


