● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
● సర్పంచులు,
పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ
జనగామ రూరల్: గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీలకు అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులను వేగ వంతంగా పూర్తి చేయాలన్నారు. తమ పరిధిలో ఉన్న సహజ వనరులు, స్థానిక ఆదాయ మార్గాలను గుర్తించి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని ఆదేశించారు. జీ రామ్ జీ పథకంలో భాగంగా జాబ్ కార్డు కలిగిన ప్రతీ గ్రామీణ పేద కుటుంబానికి 125 రోజుల పని దినాలు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, డీపీఓ వెంకట్ రెడ్డి, ఈజేఎస్ పీడీ సూరి, తదితరులు పాల్గొన్నారు.


