పెరుగుతున్న నిత్యావసర ధరలు
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలి. పెరిగిన ధలకు అనుగుణంగా విద్యార్థికి రోజుకు 30 రూపాయలు ఇవ్వాలి. లేకుంటే నిత్యావసరాలు, గ్యాస్ ప్రభుత్వమే అందించాలి. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి.
– రాపర్తి రాజు, జిల్లా అధ్యక్షుడు, సీఐటీయూ
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలంటే మార్కెట్ ధరలకు అనుగుణంగా చార్జీలు చెల్లించాలి. గుడ్డు ధర రూ.7నుంచి 8 వరకు ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వం ఇస్తున్న చార్జీలు సరిపడక మాపై భారం పడుతోంది. అప్పులు చేసి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం.
– తాటికాయల రేణుక, భోజన కార్మికురాలు, జఫర్గఢ్
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలనే అధికారుల ఒత్తిడితో సతమతమవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు లేకపోవడంతో అప్పులు చేసి భోజనం పెట్టాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు కోడిగుడ్డు వడ్డించడం లేదు. జిల్లావ్యాప్తంగా 504 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో సుమారుగా 30వేల వరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే చార్జీలు పెంచాలని అలాగే కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతున్నారు.
పెరిగిన గ్యాస్, గుడ్డు ధరలు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వంట కార్మికులకు ప్రతీ నెల రూ.3వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అధికారులు చెబుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించడంలేదు. ఆరు నెలల్లో ఆరు సార్లు గ్యాస్ ధరలు పెరగంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గత ఏడాది చార్జీలు స్వల్పంగా పెంచినా సరిపోవడం లేదు. ప్రభుత్వం గుడ్డుకు రూ.6 చెల్లిస్తుండగా, మార్కెట్లో గుడ్డు ధర రూ.7నుంచి 8 వరకు ఉంది. దీంతో కార్మికులపై భారం పడుతోంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78 పైసలు 6 నుంచి 8వ తరగతి వరకు రూ.10.17, తొమ్మిది, పదో తరగతికి రూ.13.17పైసల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. కోడిగుడ్డుతో కలిసి రెండు కూరలు మెనూ ప్రకారం అందించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.25 నుంచి రూ.30లు ఇస్తే మెనూ ప్రకారం వారానికి మూడు కోడిగుడ్లు, అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలతో భోజనం వడ్డించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. లేదంటే నిత్యా వసరాలు, వంట గ్యాస్ ప్రభుత్వమే సమకూర్చాలని కోరుతున్నారు.
కొండెక్కిన గుడ్డు ధర
అరకొర చార్జీలతో ఏజెన్సీ
నిర్వాహకుల ఆవేదన
మెనూ అందక విద్యార్థుల ఇబ్బందులు
మార్కెట్ ధరలకు అనుగుణంగా
చార్జీలు పెంచాలని డిమాండ్


