జనగామ రూరల్: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనాపరంగా మరింత బలోపేతం చేసి గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, గ్రామస్థాయి అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ సందీప్కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై బుధవారం నుంచి మూడు రోజుల పాటు సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులకు సమగ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వీబీ జీ రామ్ జీ చట్టంపై ప్రతీ సర్పంచ్, కార్యదర్శికి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు స్పష్టంగా నిర్వహించాలని సూచించారు. వీసీలో డీఆర్డీఓ భాస్కర్, డీపీఓ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క


