● పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
హన్మకొండ చౌరస్తా: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అధికారులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం ఆమె మొదటిసారిగా హనుమకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేసి, వాటి స్వాధీనానికి కారణాలు, కేసుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల నమోదులు, ఇతర పరిపాలన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలు తెలుసుకుని, వారి విధి నిర్వహణపై ఆరా తీశారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల సేవకులనే భావనతో విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అందిన ప్రతీ ఫిర్యాదును వెంటనే నమోదు చేసి రశీదు అందజేయాలని సూచించారు. సీపీ శ్వేత వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీ లు నర్సింహరావు, సత్యనారాయణ, హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.


