● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పుట్టిన జిల్లాలో పనిచేసే అవకాశం లభించడం గర్వకారణమన్నారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ మాట్లాడుతూ యువత దొడ్డి కొమురయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభిగౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ రావు, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, వైటీడీఏ సభ్యులు లక్ష్మి నారాయణ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, కంచె రాములు, మల్లేశం, జూకంటి శ్రీశైలం, కానుగంటి ముత్తయ్య, బాలరాజు, ఎదునూరి మాదార్, వెంకట మల్లయ్య పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి
జనగామ రూరల్: పంట మార్పిడి విధానాలు, ఆయిల్ పామ్ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి సీఎస్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2026–27 సంవత్సరానికి 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలోని అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందించాలన్నారు. ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాల్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీఏఓ అంబికా సోనీ, సీపీఓ చినకోట్యా నాయక్, మిషన్ భగీరథ ఈఈ శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.


