జనగామ: జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న పోస్టుల నియామక పరీక్షలను పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించినట్లు కలెక్టర్, జిల్లా అవుట్సోర్సింగ్ కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అర్హులైన ప్రతీ అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించేలా పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశం హాలులో నిర్వహించిన నియామక పరీక్షలను శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. జూలై 2న వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) పోస్టుల భర్తీకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 3న వైద్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎల్ఎస్ పోస్టులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థలలో పార్ట్టైమ్ టీచర్ పోస్టుల భర్తీ కోసం మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్లు వివరి ంచారు. పరీక్షలకు మంచి స్పందన లభించిందని, వ్యవసాయ శాఖ ఏఈఓ పోస్టులకు 111 మంది దరఖాస్తు చేయగా 94 మంది హాజరయ్యారని తెలిపారు. వైద్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎల్ఎస్ పోస్టులకు 100 మంది దరఖాస్తు చేయగా 75 మంది పరీక్ష రాశారని చెప్పారు. సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థల పార్ట్టైమ్ టీచర్ పోస్టులకు 100 మంది దరఖాస్తు చేయగా 82 మంది హాజరైనట్లు వెల్లడించారు. అన్ని పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు పక్కా ఇళ్లు అందేలా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండో విడతకు సంబంధించి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు తొలి ప్రాధాన్యమిస్తూ అర్హులను ఎంపిక చేయాలని తెలిపారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
పరిశీలించిన కలెక్టర్
సందీప్ కుమార్ ఝా


