జనగామ: జిల్లాలో వానాకాలం సీజన్లో సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం–నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్) పథకం ద్వారా ఇన్పుట్ సబ్సిడీలు అందనున్నాయి. ఈ పథకం కింద డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడే వరితో పాటు 7 రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న తదితర పంటలను సాగుచేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు.
ఆత్మనిర్భర్ పప్పు దినుసుల మిషన్..
జిల్లాలో పప్పు దినుసుల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ పప్పు దినుసుల మిషన్ కింద రైతులకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాకు మొత్తం 104 యూనిట్లు మంజూరయ్యాయి. కంది పంటల సాగును విస్తరించడంతో పాటు అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించనున్నారు. ఇందులో కంది పంటకు సంబంధించి టీడీఆర్జీ–59, ఎల్ఆర్జీ–52, ఇక్రిసాట్ అభివృద్ధి చేసిన ఆశ వైరెటీ విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఎన్జీజీ 385 రకానికి చెందిన పెసర విత్తనాలను ఉచితంగా అందించారు. ఈ రకాలు తక్కువ కాలంలో పంట కోతకు వచ్చే లక్షణం కలిగి ఉండడంతో పాటు ఎండు పరిస్థితులు, ప్రధాన తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీంతో రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ విత్తనాలతో సాగు చేయాలనే ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం ప్రయోజ నాలు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పప్పు దినుసుల సాగు విస్తరణతో జిల్లాలో ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూ డా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్ ఎఫ్ఎస్ఎం కింద రైతులకు
ఇన్ పుట్ సబ్సిడీలు
మొక్కజొన్న, పప్పు, చిరుధాన్యాల
సాగుకు ఊతం
డయాబెటిక్ నియంత్రణకు ఉపయోగపడే
పంటలపై కేంద్రం ప్రత్యేక దృష్టి
సాగు ఖర్చు తగ్గించి
దిగుబడి పెంచడమే లక్ష్యం
పప్పు ధాన్యాల సాగు పెంచడమే
లక్ష్యంగా..
జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 2.13 లక్షల ఎకరాల్లో వరి, 13వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు ఉంటుందని అంచనా. క్రాప్ డైవర్షన్లో మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగును కూడా ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఆర్థిక భారం తగ్గించే విధంగా ఇన్పుట్న సబ్సిడీపై పంపిణీ చేస్తారు. దీంతో సాగు ఖర్చు తగ్గడమే కాకుండా, పంట దిగుబడి, నాణ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడే వరి, చిరుధాన్యాల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పోషక విలువలు అధికంగా ఉండే ఈ పంటల సాగు పెరగడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి వస్తుంది.


