రఘునాథపల్లి: కలెక్టర్ సందీప్కుమార్ ఝా లెక్కల మాస్టారుగా మారి విద్యార్థులకు సులభ పద్ధతిలో లెక్కలు ఎలా చేయాలో నేర్పించారు. బుధవారం మండలంలోని ఖిలాషాపూర్ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులకు సులభమైన పద్ధతిలో లెక్కలు ఎలా చేయాలో స్వయంగా వివరించారు. పఠన సామర్థ్యం, విద్యార్థులు చదివే నైపుణ్యం తెల్చుకునేందుకు వారితో ముచ్చటించారు. ప్రతీ విద్యార్థిలో ప్రాథమిక అభ్యాసన నైపుణ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం ఉండరాదన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రమైన, రుచికరమైన భోజనం అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను పరిశీలించారు.


