జఫర్గఢ్ మండలం టీబీ తండా రేగడి తండా శివారుకు చెందిన భూక్య సుమన్కు రెండు చోట్ల 10 ఎకరాల భూమి ఉంది. ఒకచోట ఉన్న బావి ఎండిపోయింది. 5 బోర్లు వేసినా నీరు పడలేదు. మరోచోట వేసిన బోరు సక్సెస్ అయింది. అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలోని భూమికి నీరందించేందుకు 300 పైపులు వేశాడు. ఒక్కో పైపు రూ.600 చొప్పున రూ.2.7 లక్షలు, జేసీబీ, డోజర్ ఖర్చులు అదనం. పైప్లైన్ ద్వారా నీటిని ఎండిన బావిలోకి తరలించి, అక్కడి నుంచి మరో మోటర్తో పంటలకు నీరందిస్తున్నాడు. గత యాసంగిలో 5 ఎకరాల మొక్కజొన్న సాగు చేసి మంచి దిగుబడి పొందాడు. ఈ ఖరీఫ్లో 3 ఎకరాల పత్తికి స్ప్రింక్లర్లతో నీరు, 2 ఎకరాల్లో వరి సాగుకు సిద్ధం చేశాడు. ఖరీఫ్ ప్రారంభమై నెలదాటినా సరైన వానలు లేకపోవడంతో పంట చేతికి అందడం కష్టమని అంటున్నాడు.
మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు
బచ్చన్నపేట మండలంలోని బోనకొల్లురు గ్రామానికి చెందిన రైతు చేర్యాల నర్సింహులుకు ఆరు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఉన్న రెండు బోర్లు ప్రెషర్ తగ్గి, గ్యాప్ ఇస్తుండడంతో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దీనికి తోడు వర్షాలు లేకపోవడంతో నాలుగు ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు రోజుకు ఒకతడి చొప్పున మడులకు నీరు పారిస్తూ రెక్కలను గుల్ల చేసుకుంటున్నాడు.


