పాలకుర్తి టౌన్: మండలంలోని బమ్మెరలో వచ్చే నెల 12న నెల్లుట్ల ఫౌండేషన్ కళాపీఠం, జనగామ కవులు కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోతన జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కవులు, కళాకారుల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, ఉత్సవ కమిటీ కన్వీనర్ నెల్లుట్ల రవీందర్రావు, ప్రోగ్రాం డైరెక్టర్ జి.కృష్ణ తెలిపారు. శనివారం మండలంలోని బమ్మెరలోని పోతన స్మృతి వనంలో సహజ కవి పోతన జయంతి ఉత్సవాలు–2026 పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూలై 12 ఆదివారం బమ్మెరలో సాయంత్రం 4 గంటలకు పోతన సాహిత్య,శ్రీమదాంద్ర భాగవతంపై కవితా గోష్ఠి, అనంతరం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ చింతలపాటి శూలపాణి సారథ్యంలో భక్తపోతన పద్యనాటక ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోతన జయంతి ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు, యువత, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.


