న్యూస్రీల్
శనివారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2026
జనగామ: దేశంలో పత్తి ఉత్పాదకతను పెంచి రైతుల ఆదాయాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మిషన్ కాటన్ ప్రాజెక్టు’ అమలు చేయనుంది. అధిక మొక్కల సాంద్రతతో పత్తి సాగును ప్రోత్సహిస్తూ ఎకరాకు దిగుబడి పెంచడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయగా, జిల్లాల వారీగా అమలుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది.
50శాతం సబ్సిడీతో
మిషన్ కాటన్ ప్రాజెక్టు పథకంలో భాగంగా రైతులకు 50 శాతం సబ్సిడీతో పత్తి విత్తన ప్యాకెట్లు అందించనున్నారు. రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకంతో సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు, ఏ రకం విత్తనం అవసరమో నమోదు చేయించుకోవాలి. రైతుల నుంచి వచ్చిన ఇండెంట్ ఆధారంగానే అవసరమైన విత్తనాల వివరాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నారు.
మూడు రకాల సాగు విధానం
మిషన్ కాటన్ కింద నార్మల్, క్లోజ్ డెన్సిటీ, హైడెన్సిటీ అనే మూడు సాగు విధానాలను రైతులకు పరిచయం చేయనున్నారు. ఒక ఎకరంలో రెండు, నాలుగు, ఆరు ప్యాకెట్ల విత్తనాలను వినియోగించే విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా హైడెన్సిటీ విధానంలో చదరపు మీటరుకు ఎక్కువ మొక్కలను నాటే అవకాశం ఉండడంతో ఎకరాకు అధిక దిగుబడి సాధించే అవకాశముందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పద్ధతిలో విత్తనాల ఎంపిక, మొక్కల సాంద్రత, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, పురుగు నివారణ వంటి అంశాలను శాసీ్త్రయంగా పాటి ంచడం అత్యంత కీలకమని సూచిస్తున్నారు.
ఒకేచోట 50హెక్టార్లలో
ముఖ్యంగా తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఒకే ప్రాంతంలో సమీకృతంగా పత్తి సాగు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనివల్ల సాంకేతిక పర్యవేక్షణ సులభం కావడంతో పాటు అధిక దిగుబడి సాధించే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల వారీగా అవగాహన సదస్సులు, క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రైతులను ఈ విధానంపై చైతన్యపరచనున్నారు.
ప్రాజెక్టు విజయవంతం కోసం
జిల్లాకు కూడా మిషన్ కాటన్ కింద ప్రత్యేక లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో కనీసం సగం విస్తీర్ణంలో మిషన్ కాటన్ ప్రాజెక్టు విధానాలను అమలు చేసి రైతులకు అధిక దిగుబడి, మెరుగైన ఆర్థిక లాభాలు చేకూరేలా చర్యలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక దృష్టి సారించగా, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పిస్తూ మిషన్ కాటన్న్ను విజయవంతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
మిషన్ కాటన్కు 14 కంపెనీల ప్రతిపాదనలు
కేంద్ర ప్రభుత్వం 2026–27 సంవత్సరానికి అమలు చేయనున్న మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ విత్తన సంస్థలు 14 కంపెనీలకు చెందిన 20 హైబ్రిడ్ పత్తి విత్తన రకాలను ప్రతిపాదించాయి. ఈ రకాలను హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ (హెచ్డీపీఎస్), క్లోజ్ స్పేసింగ్ (సీఎస్), సమగ్ర పంట యాజమాన్యం (ఐసీఎం) విధానాలకు అనుకూలంగా పేర్కొన్నాయి. ఆయా హైబ్రిడ్ రకాల గెజిట్ నోటిఫికేషన్ వివరాలను కూడా జతచేసి, జిల్లాలు రైతుల ఇండెంట్ మేరకు విత్తనాల ప్రతిపాదనలు పంపాలని సూచించా రు. దీంతో రైతులకు శాసీ్త్రయ సాగుకు అనువైన విత్తనాల ఎంపికకు అవకాశం కలగనుంది.
మిషన్ కాటన్ ప్రాజెక్టుకు
కేంద్రం శ్రీకారం
అధిక దిగుబడి..
రైతు ఆదాయం పెంపే లక్ష్యం
కొత్త విధానాలకు ప్రోత్సాహం
50 శాతం సబ్సిడీతో విత్తనాలు
రైతుల ఇండెంట్ మేరకే
విత్తనాల సరఫరా
గ్రామాల వారీగా అవగాహన
సదస్సులకు జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం
మిషన్ కాటన్ ప్రాజెక్టు సమాచారం:
అంశం వివరాలు
ప్రాజెక్టు పేరు మిషన్ కాటన్ ప్రాజెక్టు
అమలు సంస్థ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ శాఖల ద్వారా
ప్రధాన లక్ష్యం పత్తిలో అధిక దిగుబడి, రైతుల ఆదాయం పెంపు
సబ్సిడీ పత్తి విత్తన ప్యాకెట్లపై 50శాతం సబ్సిడీ
సాగు విధానాలు నార్మల్, క్లోజ్ డెన్సిటీ, హైడెన్సిటీ
విత్తనాల వినియోగం ఎకరానికి 2, 4, 6 ప్యాకెట్ల విధానాలు
రైతులు చేయాల్సింది పట్టాదారు పాసుపుస్తకంతో ఏఓను సంప్రదించాలి
విత్తనాల కేటాయింపు రైతుల ఇండెంట్గా ప్రభుత్వానికి ప్రతిపాదనలు
జిల్లా లక్ష్యం జిల్లాకు ప్రత్యేక టార్గెట్ కేటాయింపు
జిల్లాలో పత్తి విస్తీర్ణం వానాకాలం సాగు అంచనా 1.30 లక్షల ఎకరాలు


