● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే
కడియం శ్రీహరి
రఘునాథపల్లి: రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, సంక్షేమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు, సన్నబియ్యం తదితర పథకాలు దేశంలో ఎక్కడ లేని విధంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని గబ్బెట గ్రామంలో రూ.20 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం, రూ.15లక్షలతో సీసీ రోడ్డు, నూతన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ.. పనిచేసిన నాయకులను, చేయని వారిని ఒకే రకంగా చూడొద్దని కోరారు. గబ్బెట గ్రామంలోనే రూ.1.50 కోట్లతో అభివృద్ది పనులు చేసుకున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిలోపు గబ్బెటకు మరో కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో 47 మంది లబ్ధిదారులకు అయా గ్రామాల సర్పంచ్లతో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, తహసీల్దార్ రాజేష్రెడ్డి, సర్పంచ్లు కూటిగంటి ఉపేంద్రఅనిల్, బొల్లం ఉమారాణి, బొమ్మ వీరస్వామి, గైని శ్రీనివాస్గౌడ్, ఇల్లందుల రవి, సదానందం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, పోకల శివకుమార్, నామాల బుచ్చయ్య, కోళ్ల రవిగౌడ్, లింగాజి, గాదె మహేందర్రెడ్డి, గొరిగ రవి, శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలి
జనగామ రూరల్: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి శశి పిలుపునిచ్చారు. గురువారం జనగామ చౌరస్తాలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా చౌరస్తాలో విద్యార్థులు మానవహారం చేపట్టి మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జెడ్జి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే 1908 టోల్–ఫ్రీ నంబర్ సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పాఠశాలలు కళాశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు జూనియర్ సివిల్ జడ్జి శశి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


