● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రఘునాథపల్లి: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని నిడిగొండ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. 6,7 తరగతి విద్యార్థుల పఠన సామర్థ్యాలను స్వయంగా పరీక్షించి, విద్యార్థులు పాఠ్యాంశాలను ఎంత వరకు అర్థం చేసుకుంటున్నారో తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం ఉండరాదన్నారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను పరిశీలించి జీవశాస్త్ర ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఫాస్ట్ మ్యాథ్స్ సద్వినియోగం చేసుకోవాలి
జనగామ రూరల్: ప్రతతీ విద్యార్థి గణితంలో విషయావగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన ‘ఫాస్ట్ మ్యాథ్స్‘ పుస్తకాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆవిష్కరించారు. కలెక్టర్ మా ట్లాడుతూ.. విద్యార్థులు గణితంపై భయాన్ని విడిచిపెట్టి ఆత్మవిశ్వాసంతో అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, ప్రధానోపాధ్యాయులు అఫ్సర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


