● అంతరాయాలు తగ్గించేందుకు
ఎమర్జెన్సీ రీస్టోరేషన్ వాహనాలు
● జనగామ సర్కిల్ పరిధిలో
అందుబాటులోకి..
జనగామ: ప్రకృతి విపత్తులు, భారీ వర్షాలు, ఈదురుగాలులు, సాంకేతిక లోపాలు వంటి కారణాలతో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించేందుకు జనగామ ఎన్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలో పటిష్ట చర్యలు చేపట్టారు. సంస్థ ఎస్ఈ సంపత్రెడ్డి నేతృత్వంలో వినియోగదారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అత్యవసర రీస్టోరేషన్ చర్యలను ప్రాధాన్యంగా అమలు చేస్తున్నారు.
సర్కిల్ పరిధిలో రెండు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ వాహనాలు
సర్కిల్ పరిధిలో 2 ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ (ఈఆర్టీ) వాహనాలు సిద్ధం చేశారు. 24 గంటల పాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సబ్డివిజన్ స్థాయిలో 7 ప్రత్యేక వాహనాలు కూడా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ముందుగానే సిద్ధం చేసి ఉంచారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతుల కు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ వంటి మెటీరియల్ను ముందుగానే లోడ్ చేసి ఉంచుతున్నారు. సమస్య ఏర్పడిన వెంటనే బృందాలు ఘటనాస్థలానికి చేరుకునేందుకు ఈ ఆర్టీ వాహనాలకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చారు. దీంతో సమస్యలను అత్యంత వేగంగా గుర్తించి పరిష్కరించే అవకాశం కలుగుతుంది.
తక్షణ పరిష్కారం..
విద్యుత్ సరఫరాలో హఠాత్తుగా ఏర్పడే లోపాలు, లైన్ బ్రేక్డౌన్లు, ట్రాన్స్ఫార్మర్ సమస్యలను వీటి సహాయంతో తక్షణమే పరిష్కరించడంలో ఈ వ్య వస్థ ఉపకరిస్తుంది. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉత్పన్నమైతే టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నారు. ఈ నెంబర్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
నాణ్యమైన సేవల కోసం..
విద్యుత్ అంతరాయాలను తగ్గించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో సంస్థ మరింత సమర్థవంతంగా ముందుకెళ్తోంది. విద్యుత్ అంతరాయాల సమయంలో తక్షణం పునరుద్ధరించేందుకు ఈఆర్టీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. 24 గంటల పాటు ఈ కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికారులు, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమస్యలను మాకు వేగంగా తెలియజేయవచ్చు.
–సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, జనగామ


