● నిబంధనలు ఉల్లంఘించిన
6 దుకాణాలపై కేసు నమోదు
జనగామ: జిల్లాలో మత్తు కలిగించే మందుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు డ్రగ్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వరంగల్ ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో 65 మెడికల్ షాపుల్లో టెస్ట్ పర్చేజ్ విధానాన్ని అమలు చేశారు. అపరిచిత వ్యక్తుల ద్వారా మందులు విక్రయిస్తున్నారో లేదో పరీక్షించగా పలు అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. ఈ తనిఖీల్లో 6 మెడికల్ షాపులు నిషేధితంగా, మత్తును కలిగించే ట్రమాడాల్ అనే నొప్పినివారణ మందును నిబంధనలు ఉల్లంఘించి విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. జనగామలో 2, రఘునాథపల్లిలో 3, స్టేషన్ ఘన్పూర్లో ఒక దుకాణంపై కేసు నమోదు చేసి ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి సిఫారసు చేయగా, సంబంధిత షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మత్తు కలిగించే మందులను అనధికారికంగా విక్రయించినా, వినియోగించినా చట్టపరంగా కఠినమైన క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


