దేవరుప్పుల: విద్య, వైద్య రంగాల పురోగతితోనే సమాజ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని సింగరాజుపల్లిలో ఆకస్మికంగా పర్యటించి పలు సూచనలు చేశారు. తొలుత ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల నిర్వహణ, 6, 8, 9, 10వ తరగతి గదుల్లో జరుగుతున్న బోధన విధానాన్ని గమనించి, విద్యార్థులతో మాట్లాడారు. టెన్త్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను పరీక్షించారు. గణితం, జీవ శాస్త్ర పాఠాలను బోధించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, తాగునీరు, పరిశుభ్రత వంటి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల నిల్వ, టీకా కార్యక్రమాల అమలు వంటి అంశాలను సమీక్షించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలకు అవసరమైన టీకాలు సమయానికి ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల హాజరు, పౌష్టికాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తాగునీటి ట్యాంకు పరిసర ప్రాంతంలో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వీధులు, డ్రెయినేజీలు, చెత్త నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీపీఓ వసంత, హౌసింగ్ పీడీ మాతృ నాయక్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్ కొండ ఊర్మిళమల్లారెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్కుమార్ ఝా
సింగరాజుపల్లిలో ఆకస్మిక పర్యటన


