జనగామ రూరల్: రైతుల డబ్బులతో రాజకీయాలు చేస్తే సహించేది లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందునాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని రాపర్తి సోమయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో రైతులకు భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను వెంటనే ఖాతాల్లో జమచేయాలన్నారు. జిల్లాలో మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈనెల 23, 24 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మాచర్ల సారయ్య, రామావత్ మీట్యా నాయక్, బెల్లకొండ వెంకటేష్, మంగ బీరయ్య, నక్క యాకయ్య, అంజయ్య, మంద చంద్రమోళి, కుమారస్వామి, బిక్షపతి, రాములు, తదితరులు పాల్గొన్నారు.


