జనగామ రూరల్: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నిౖకైన సర్పంచులు, కౌన్సిలర్లకు పాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగేందుకు 99 రోజుల ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 12వ తేదీన ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈనెల 12న ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పది థీమ్లను వివరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రగతి ప్రణాళికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష


