న్యూస్రీల్
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026
జనగామ: రాష్ట్ర విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇ.నవీన్ నికోలస్ ముందడుగు వేశారు. ఉపాధ్యాయుల నైపుణ్యాలు, శిక్షణ అవసరాలను కచ్చితంగా తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నీడ్ బెస్డ్ సర్వే ప్రారంభిస్తూ, 2026 శిక్షణ ప్రణాళికలకు బలమైన పునాది వేశారు. విద్యార్థుల అభ్యాస ప్రమాణాల పెరుగుదలకే కేంద్రీకృతమైన ఈ చర్య,.. విద్యారంగంలో కీలకమైన మార్పులకు నాంది పలుకుతోంది.
విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదల..
2026 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల శిక్షణ అవసరాలను గుర్తించేందుకు ఎస్సీఈఆర్టీ రాష్ట్ర వ్యాప్తంగా నీడ్ బేస్డ్ సర్వే ప్రారంభించింది. ప్రభుత్వ ఎల్బీ, కేజీబీవీ, మోడల్, యూఆర్ఎస్, అన్ని గురుకులాలు, వివిధ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, ఎంపీఈఓలు, డీఈఓల శిక్షణ అవసరాలను కచ్చితంగా అర్థం చేసుకోవడానికి ఈ సర్వే రూపొందించింది. 2025 వేసవి శిక్షణ, అనంతర విద్యా సంవత్సరంలో నిర్వహించిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చిన నేపథ్యంలో, 2026కు శిక్షణలను పూర్తిగా అవసరాల ఆధారంగా ప్రణాళిక చేయడానికి ఈ సర్వే ముఖ్యమైనదిగా పేర్కొంది. తరగతి గదిలో ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలు, వారు అభ్యసించాలనుకునే అంశాలు, ఆధునిక బోధన పద్ధతులపై అవసరమయ్యే శిక్షణలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ప్రధాన ఉద్దేశంగా ఎస్సీఈఆర్టీ వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆన్లైన్ ఫారం ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
నేడు చివరి అవకాశం..
ఉపాధ్యాయులు ఈనెల 10వ తేదీ(మంగళవారం)లోపు తమ వివరాలను సమర్పించాలని ఎస్సీఈఆర్టీ సూచించింది. నిర్ణీత గడువులోపు స్పందించే విధంగా జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్లు ఉపాధ్యాయులకు సమాచారాన్ని పూర్తి స్థాయిలో చేరవేయాలని ఆదేశించింది. ఉపాధ్యాయుల అభిప్రాయాల మేరకు 2026 వేసవి సెలవులతో పాటు 2026–27 నూతన విద్యాసంవత్సరంలో జిల్లాల వారీగా ప్రత్యేక శిక్షణల ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు ఎస్సీఈఆర్టీ జీఓలో స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాల పెరుగుదల, ప్రధానోపాధ్యాయుల నాయకత్వాభివృద్ధి, విద్యార్థుల సాధన ప్రమాణాల మెరుగుదల లక్ష్యాలతో రూపొందించబడిన ఈ సర్వే రాష్ట్ర విద్యావ్యవస్థ పురోగతికి పునాదిరాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
విద్యార్థుల అభ్యాస ప్రమాణాల
పెంపునకు ముందడుగు
టీచర్ల బోధనా నైపుణ్యాల పెంపుపై విద్యాశాఖ దృష్టి
ఉపాధ్యాయుల అభిప్రాయ
సేకరణకు సర్వే
డాటా ఆధారంగానే వేసవి శిక్షణ ప్రణాళిక
ప్రభుత్వ విద్యా వ్యవస్థ పురోగతికి
సర్వే కీలకం
మెజార్టీ టీచర్ల అభిప్రాయాల మేరకే
ఉపాధ్యాయుల నైపుణ్య అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఈసారి మరింత విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలను ప్రణాళికబద్ధం చేస్తోంది. గతంలో సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చినా, ఇప్పుడు ఉపాధ్యాయుల అవసరాల ప్రకారం కమ్యూనికేషన్ స్కిల్స్, ఐసీటీ, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ నాలెడ్జ్, ల్యాబ్ నిర్వహణ వంటి విభాగాల్లో శిక్షణల అవసరమేమిటో తెలుసుకునేందుకు ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తోంది. మెజార్టీ ఉపాధ్యాయుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఈసారి స్కూల్ అసిస్టెంట్లతో పాటు మోడల్, కేజీబీవీ, అన్ని గురుకులాల ఉపాధ్యాయులను కూడా శిక్షణ పరిధిలోకి తీసుకున్నారు. ఇందుకోసం అందించిన ఆన్లైన్ లింక్ ద్వారా ఉపాధ్యాయులు తమ శిక్షణ అవసరాలను నమోదు చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.


