బుగ్గారం(ధర్మపురి): మండలంలోని పలు గ్రామాల్లో కాలువలు, ఎత్తిపోతల ద్వారా పొలాలకు సాగునీటిని సరఫరా చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధికారులకు సూచించారు. ధర్మపురి మండలంలోని నక్కలపేట, దోనూర్, తీగలధర్మారంలో శనివారం ఆయన పర్యటించారు. సాగునీటి కాలువలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువలకు అవసరమైన చోట్ల తక్షణమే మరమ్మతులు చేయించాలని అన్నారు. తీగలధర్మారంలో ఓ లబ్ధిదారు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, నాగారం సర్పంచ్ చిలుముల లక్ష్మణ్, నక్కలపేట మాజీ సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బట్ట సంచులే వాడండి
ధర్మపురిని ప్లాస్టిక్రహిత పట్టణంగా మార్చడానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. జగిత్యాలకు చెందిన న్యాయవాది మధుసూదన్రెడ్డి ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేయించిన బట్టసంచులను ఆవిష్కరించారు. ధర్మపురికి నిత్యం వేలాదిమంది భక్తుల తాకిడి ఉంటుందని, వ్యాపారులు, దుకాణాదారులు, ప్రజలు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు.
రైతుభరోసాతో రైతన్నకు అండగా
రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేసి వ్యవసాయానికి భరోసా కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. నియోజకవర్గంలోని 90,761 మందికి రూ.87.21కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.


