● నత్తనడకన అమృత్–2 పనులు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు ● ఇబ్బందుల్లో పట్టణ ప్రజలు
రాయికల్: రాయికల్ బల్దియాలో అమృత్–2 పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేయడంతో పట్టణంలోని సీసీ రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ధ్వంసం చేసిన సీసీరోడ్లకు మరమ్మతు చేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయికల్ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు కేంద్రప్రభుత్వం అమృత్ 2.0 పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బల్దియాకు రూ.15.25 కోట్లు మంజూరయ్యాయి. 20 కిలోమీటర్ల మేర ఉన్న 12 వార్డుల్లోని సీసీరోడ్లలో పైప్లైన్ హౌస్ కలెక్షన్, ఫీడర్ లైన్, డిస్ట్రిబ్యూషన్ లైన్ వంటి పనులు చేయాల్సి ఉంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పట్టణంలో ఇప్పటివరకు సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో పలు వార్డుల్లోని సీసీరోడ్లను ధ్వంసం చేస్తూ నామమాత్రంగా పనులు చేస్తున్నాడు. హౌసింగ్ కనెక్షన్, పైప్లైన్ కనెక్షన్ సరిగా బిగించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తవ్విన సీసీరోడ్ల వద్ద ఈ పనులు పూర్తి గా చేపట్టి యథావిధిగా రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ పనులు చేపడుతున్నారని ఆయా వార్డుల కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కనీసం పైప్లైన్ కోసం తవ్విన మట్టిని తొలగించి పనులు చేపట్టాలని కోరినప్పటికీ పట్టించుకోవడం లేదంటునానరు. సంబంధిత వార్డు కౌన్సిలర్లే ధ్వంసం చేసిన సీసీరోడ్లపై ఉన్న మట్టిని తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్లలో తరలించారు. మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, కమిషనర్ నాగరాజు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు చేపట్టి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
భూమి ఇచ్చేందుకు ససేమిరా..
పట్టణానికి అమృత్ 2.0 పథకానికి భూమి ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. ఇటీవల రెవెన్యూ, మున్సిపల్ అధికారులు 20 గుంటల భూమి గుర్తించినప్పటికీ ఆ భూమిని రైతులు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. మరోవైపు అమృత్ 2.0 పథకం కోసం రోడ్లను తవ్వి మరమ్మతు చేయని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


