
‘చెత్త’ దారి
జగిత్యాల: జగిత్యాల.. గ్రేడ్–1 మున్సిపాలిటీ.. 48వార్డులు.. లక్షకు పైగా జనాభా.. పారిశుధ్యం మాత్రం అస్తవ్యస్తం. రోజూ ఇంటింటికీ చెత్త సేకరణకు ఆటోలు వెళ్లాల్సి ఉండగా కొన్ని చోట్లకు వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. బల్దియాలో నాలుగు జోన్లు ఉండగా, వార్డుకొక ఆటో, జోన్కు మూడు ట్రాక్టర్లలో చెత్త తరలిస్తారు. కానీ అవి 48 వార్డులకు సరిపోవడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయా కాలనీవాసులు చెత్తనంతా ఖాళీ స్థలాలు, రోడ్లపైనే పడేస్తున్నారు. కొన్ని చోట్ల అపార్ట్మెంట్ల సమీపంలో అధికంగా చెత్త పడేస్తున్నారు.
రోడ్లపైనే డంపింగ్యార్డులు
చెత్త సేకరణకు ఆటోలు రాక, డస్ట్బిన్లు ఏర్పాటు చేయక ప్రజలు ఎక్కడ ఖాళీస్థలం కనిపిస్తే అక్కడ, రోడ్ల వెంట పోస్తున్నారు. మరికొందరు విరిగిపోయిన కుర్చీలు, చెడిపోయిన పరుపులు, బ్యాగులు, ప్లాస్టిక్, చెడిపోయిన వస్తువులన్నింటినీ రోడ్ల పక్కనే వేస్తుండడంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందిగా మారింది.
వార్డు ఆఫీసర్లు ఎక్కడ?
మున్సిపల్లో ఇటీవలే ప్రతీ వార్డుకు ఒక ఆఫీసర్ను నియమించారు. వారు పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షించాలి. కాగా, డ్రెయినేజీల్లో సిల్ట్, రోడ్లపై చెత్త పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వార్డు ఆఫీసర్లు రోజూ కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసి పారిశుధ్యంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్లను శుభ్రపర్చేలా, మురికికాలువలు, ప్రజా మరుగుదొడ్లు, చెత్త సేకరణను చూడాల్సిన బాధ్యత ఉన్నా పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు పేర్కొంటున్నారు.
రాత్రిపూట అంతంతే..
జగిత్యాల జిల్లా కేంద్రం, పెద్ద మున్సిపాలిటీ కావడంతో రాత్రిపూట పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే స్వీపింగ్ మిష న్ మరమ్మతుకు గురికావడంతో కార్మికులు అంతంతమాత్రంగానే రోడ్లు ఊ డుస్తున్నారు. అధికారులు స్పందించి రాత్రిపూట పారిశుధ్యాన్ని మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
కన్పించని డంపర్బిన్స్
పట్టణంలో ప్రధాన ప్రాంతాల్లో డంపర్బిన్స్ ఏర్పాటు చేస్తే చెత్త సమస్య ఉండదు. గతంలో చాలాచోట్ల డంపర్బిన్స్ ఉన్నా కొన్ని చోట్ల నుంచి ఎత్తివేశారు. తడి, పొడి చెత్త సేకరణ నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపడుతున్నా కొన్ని చోట్లకు వెళ్లకపోవడం, డంపర్బిన్స్ లేక ఖాళీ స్థలాల్లోనే చెత్త పడేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రధాన ప్రాంతాల్లో డంపర్బిన్స్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
సమస్య పరిష్కారానికి చర్యలు
‘ఇది పట్టణంలోని భవాని రోడ్ నుంచి ధర్మపురికి వెళ్లే రోడ్. ఇక్కడ డ్రెయినేజీని ఆనుకుని ఉన్న స్థలంలో చెత్త వేస్తున్నారు. తినగా మిగిలిన ఆహారపదార్థాలు వేస్తుండడంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అటుగా వెళ్లాలంటే దుర్గంధం వెదజల్లుతోంది. ఈరోడ్డు గుండా చాలా మంది పాఠశాలలు, కళాశాలలకు వెళ్తుంటారు. కాగా, పందులు, కుక్కలు దాడి చేసేందుకు వస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి ఇక్కడ చెత్త వేయకుండా చూడాలని, సమీపంలో ఇంతకు ముందు ఉన్న డంపర్బిన్ను మళ్లీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో డంపర్బిన్స్ ఏర్పాటు చేయాలని ప్రొవిజన్ ఉంది. డోర్ టు డోర్ చెత్త సేకరణ ఉండడంతో ప్రతి ఒక్కరూ వాహనాలకే ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్పత్రులలో డంపర్బిన్స్ ఏర్పాటు చేశాం. చెత్త సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం.
– మహేశ్వర్రెడ్డి, శానిటరి ఇన్స్పెక్టర్

‘చెత్త’ దారి