సాధారణంగా కట్ల పాములు కాటేస్తే గాట్లు పడటం..రక్తం రావడం ఉండదు. వీటి కోరలు చిన్నగా ఉండటంతో గాట్లు పెద్దగా పడవు. గంట నుంచి రెండు గంటల వ్యవధిలో తీవ్రమైన క డుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం నాడీ వ్యవస్థపై ప్రభావం పలితంగా పక్షవాతం లక్షణాలు ఉంటా యి. చివరికి శ్వాసకోశాలు పనిచేయక మరణం సంభవిస్తుంది. పెద్దాపూర్ గురుకులంలో ప దిహేను రోజుల క్రితం మృతి చెందిన రాజారం గణాదిత్యకు చిన్ననాటి నుంచి ఫిట్స్ ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ కారణంగా బాగానే ఉన్నాడు. జూలై 25న రాత్రి మాత్రం తరగతి గదిలో పడుకున్న తమను ఏదో చిన్న విష పురుగు కుట్టినట్లు ఉందని విద్యార్థులు గణాదిత్య, గణేశ్ చెప్పడం గమనార్హం. ఆ తరువాత గణాదిత్య నురుగుల వాంతులు చేసుకోవడం తరువాత ఫిట్స్ లక్షణాలు కనిపించడంతో ఉదయం పూట ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థులకు వైద్యులు పాము కాటుకు ఇచ్చే యాంటీ పాలీవీనమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగు కోసం ఒకరికి వెంటిలేటర్ అమర్చారు. ఆ తరువాత ఇద్దరు విద్యార్థులు కోలుకుని బాగుపడ్డారు. అనంతరం గత శుక్రవారం ఎడమల అనిరుధ్ రాత్రి పది గంటల సమయంలో కడుపునొప్పి అని తోటి విద్యార్థులకు చెప్పాడు. దాదాపు రెండు గంటల పాటు కడుపునొప్పితో అనిరుధ్ విలవిల్లాడినట్లు సమాచారం. రాత్రి సమయంలో సకాలంలో వైద్యం అందకపోవడంతో తెల్లారి మృతి చెందాడు. అనంతరం హేమంత్, మోక్షిత్ అనే విద్యార్థులు ఇద్దరు కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వీరికి యాంటీ పాలీవీనమ్ ట్రీట్మెంట్ ఇవ్వడం, వెంటిలేటర్ అమర్చడంతో ఇద్దరు కోలుకున్నారు. పెద్దాపూర్ గురుకులంలో చనిపోయిన ఇద్దరు విద్యార్థులకు కట్లపాము కుట్టినప్పుడు కనిపించే లక్షణాలు ఉండటం గమనార్హం. విద్యార్థుల మృతిపై సీరియస్గా కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం మొదట గురుకులం ఆవరణను శుభ్రపరిచి పాముల ఆనవాళ్లు లేకుండా బాగు చేస్తే తమ పిల్లల ప్రాణాలకు భద్రత ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.