‘రష్యా సుంకం’ రద్దు? | US may rollback 25 Percent India tariff | Sakshi
Sakshi News home page

‘రష్యా సుంకం’ రద్దు?

Jan 24 2026 7:50 PM | Updated on Jan 25 2026 12:55 AM

 US may rollback 25 Percent India tariff

భారత్‌పై టారిఫ్‌లు 25 శాతం తగ్గింపు! 

అమెరికా సంకేతాలు పరిశీలిస్తున్నాం: బెసెంట్‌

వాషింగ్టన్‌: అమెరికా విధించిన భారీ టారిఫ్‌ల విషయంలో భారత్‌కు సగానికి సగం ఊరట లభించే అవకాశం కని్పస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు విధించిన 25 శాతం టారిఫ్‌లను రద్దు చేసే అవకాశమున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ తెలిపారు. ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ కొద్ది నెలలుగా భారీగా తగ్గించుకుంది. కనుక 25 శాతం సుంకాలను రద్దు చేసే అంశాన్ని మా ప్రభుత్వం పరిశీలించే అవకాశముంది’’అని ఆయన చెప్పారు. 

శుక్రవారం అమెరికా వార్తా సంస్థ పొలిటికో ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. ‘‘భారత్‌పై మేం విధించిన 25 శాతం చమురు టారిఫ్‌ బ్రహా్మండంగా పని చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు దాదాపుగా ఆగిపోయాయి. కనుక వాటిని వెనక్కు తీసుకునే ప్రక్రియ మొదలవుతుందనే భావిస్తున్నా’’అని వివరించారు. టారిఫ్‌ల వల్లే రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు భారీగా తగ్గాయని ఇటీవల దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు సందర్భంగా కూడా బెసెంట్‌ చెప్పుకొచ్చారు. 

తాజా పరిణామాల నేపథ్యంలో భారత్, అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో ముందడుగు పడుతుందని భావిస్తున్నారు. అయితే, భారత్‌ నుంచి శుద్ధి చేసిన చమురు తదితరాలను యూరప్‌ కొనుగోలు చేయడంపై బెసెంట్‌ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘యూరప్‌ది నిజంగా మూర్ఖపు చర్యే. భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని యూరప్‌ అంగలారుస్తోంది. అందుకే రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఆ దేశంపై అధిక సుంకాలు విధించలేదు’’అంటూ నిందించారు. 

ఆగస్టు నుంచీ రగడ 
భారీ వాణిజ్య అసమతుల్యతను సరిచేసే పేరిట భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత ఆగస్టులో తొలుత 25 శాతం టారిఫ్‌ విధించడం తెలిసిందే. రష్యా చమురు దిగుమతులను సాకుగా చూపుతూ కొంతకాలానికే మరో 25 శాతం మేరకు బాదారు. అంతేగాక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే, దాన్ని తిరిగి విక్రయించే దేశాలపై ఏకంగా 500 శాతం టారిఫ్‌ విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహం ఇటీవల అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టారు కూడా! రష్యా తన చమురు కొనుగోళ్ల నిధులను ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెచ్చిస్తోందని అమెరికా ఆరోపిస్తుండటం తెలిసిందే. 
 
అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్, రష్యా నుంచి అధిక మెుత్తంలో చమురు దిగుమతి చేసుకుంటుంది. కాగా మెుత్తంగా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement