చర్యలకు ఉపక్రమించిన అధ్యక్షుడు రాజపక్స.. కష్టాల నుంచి లంక గట్టేక్కేనా?
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతోంది. ఆహార వస్తువుల కొరత, నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చోవడంతో.. పట్టెడన్నం తినలేక పస్తులుంటున్నారు లంక ప్రజలు. ఈక్రమంలో అప్పుల ఊబిలో చిక్కుకున్న దేశాన్ని గట్టెకించేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స చర్యలకు ఉపక్రమించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సలహాలు, సూచనల కోసం ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సలహా బృందాన్ని నియమించారు.
అంతర్జాతీయ ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సలహా బృందాన్ని రాజపక్స నియమించారు. ఐఎంఎఫ్తో చర్చలు జరపడం, ప్రస్తుత రుణ సంక్షోభాన్ని అధిగమించడంపై మార్గదర్శకత్వం చేసే బాధ్యతలను ఈ బృందానికి అప్పగించారు.మరోవైపు.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు.