ఇజ్రాయెల్‌ దాడుల్లో జర్నలిస్టుల మృతి | Israel-Hamas war: Al Jazeera journalists were killed | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ దాడుల్లో జర్నలిస్టుల మృతి

Jan 8 2024 6:17 AM | Updated on Jan 8 2024 6:17 AM

Israel-Hamas war: Al Jazeera journalists were killed - Sakshi

రఫా: గాజా్రస్టిప్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం దక్షిణ గాజాపై జరిగిన దాడుల్లో ఇద్దరు పాలస్తీనా జర్నలిస్టులు మరణించారు. వీరిలో అల్‌–జజీరా సీనియర్‌ కరస్పాండెంట్‌ వాయిల్‌ దాహ్‌దౌ కుమారుడు హమ్జా దాహ్‌దౌ కూడా ఉన్నాడు. మరో జర్నలిస్టు కూడా మృతి చెందాడు. ఇజ్రాయెల్‌ దాడుల్లో వాయిల్‌ దాహ్‌దౌ కుటుంబంలో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, మనవడు ఇప్పటికే చనిపోగా, ఆదివారం మరో కుమారుడు బలయ్యాడు.

దాహ్‌దౌ సైతం గాయాలపాలయ్యాడు. అయినప్పటికీ తన విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధ వార్తలను ప్రపంచానికి అందిస్తున్నాడు. గాజాలో అసలేం జరుగుతోందో ప్రపంచం తెలుసుకోవాలని, అందుకోసం తన ప్రాణాలైనా ధారపోస్తానని వాయిల్‌ దాహ్‌దౌ చెప్పాడు. తన కుటుంబం మొత్తం బలైపోయినా తన సంకల్పం సడలిపోదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 22,800 మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement