టెహ్రాన్: ఇరాన్ యుద్ధం కొత్త వ్యూహాలతో యూ టర్న్ తీసుకుంటోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ దూకుడు పెంచింది. తాజాగా ఇరాన్.. హిందూ మహాసముద్రంపైకి రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే,ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారనే విషయం తెలియాల్సి ఉంది.
వివరాల మేరకు.. ఇరాన్ హిందూ మహా సముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియా టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను తాకలేదని తెలుస్తోంది. అయితే, ఒకటి మాత్రం మార్గ మధ్యలోనే విఫలమైందని, మరొకదాన్ని తమ దేశం అడ్డుకుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. ఈ దాడులపై ఇరాన్ కూడా స్పందించకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. ఇరాన్తో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. అలాగే, క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారుచేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. తాము తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక, అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ అన్నారు. ‘ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.


