లండన్​లో భారత విద్యార్థి మృతి.. | Indian Student Who Went Missing Last Month Found Dead In London River | Sakshi
Sakshi News home page

లండన్​లో భారత విద్యార్థి మృతి.. విదేశాలకు వెళ్లిన మూడు నెలల్లోనే ఘోరం..

Dec 2 2023 8:15 AM | Updated on Dec 2 2023 10:10 AM

Indian Student Who Went Missing Last Month Found Dead In London River - Sakshi

నవంబర్‌ నెలలో బ్రిటన్‌లో అదృశ్యమైన భారతీయ విద్యార్థి కథ విషాదాంతమైంది. లండన్​లోని థేమ్స్ నదిలో 23 ఏళ్ల మిత్ కుమార్ పటేల్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. కాగా ఉన్నత చదువుల కోసం మిత్‌కుమార్ రెండు నెలల క్రితం (సెప్టెంబరు) యూకే వెళ్లాడు. నవంబర్ 17 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. అదృశ్యమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. 

ఈ క్రమంలో నవంబర్ 21న తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతం సమీపంలోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు కనుగొన్నారు.  అతను ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ అతను హత్యకు గురవ్వలేదని, అనుమానాస్పద మృతి కాదని పోలీసులు చెబుతున్నారు.

మిత్‌కుమార్ పటేల్ వ్యవసాయ కుటుంబానికి చెందిన యువకుడు కావడంతో అతడి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేసేందుకు నిధులు సమీకరిస్తున్నట్టు అతడి బంధువు పార్త్ పటేల్ అనే వ్యక్తి వెల్లడించాడు. ‘గో ఫండ్ మీ’ ఆన్‌లైన్ ఫండ్ రైజర్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించామని తెలిపాడు. వారం వ్యవధిలో జీబీపీ(గ్రేట్ బ్రిటన్ పౌండ్స్) 4,500కి(4 లక్షల 76  వేలు) పైగా వచ్చాయని తెలిపాడు. మిత్‌కుమార్ వయసు 23 సంవత్సరాలని, 19 సెప్టెంబర్ 2023న యూకే వచ్చాడని చెప్పాడు.

నవంబర్​ 20న షెఫీల్డ్​ హాలమ్​ వర్సిటీలో డిగ్రీ కోర్సు ప్రారంభించాల్సి ఉందని, అమెజాన్​లో పార్ట్​టైమ్​ జాబ్​ కూడా లభించిందని తెలిపాడు. ఇంతలోనే నవంబర్​ 17న డైలీ వాక్​కు వెళ్లిన పటేల్​.. తిరిగి ఇంటికి వెళ్లలేదని చెప్పాడు. నవంబర్ 21న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారని.. ఉన్నత చదువుల కోసం వచ్చిన వ్యక్తి ఈ విధంగా చనిపోవడం బాధ కలిగిస్తోందని, అతడి కుటుంబానికి సహాయం చేయాలని భావించామని చెప్పాడు. మిత్‌కుమార్ మృతదేహాన్ని భారత్‌కు పంపిస్తామని అన్నాడు. సేకరించిన నిధులను ఇండియాలోని మిత్‌కుమార్ కుటుంబానికి అందిస్తామని చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement