ఢిల్లీ: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్కు మతి భ్రమించిందని భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసిఫ్ ఏ పనీలేక తనకు అవగాహన లేని విషయాలపై పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తి రక్షణ మంత్రిగా కొనసాగడం వల్లే పాక్ ప్రస్తుత ఆ పరిస్థితుల్లో ఉందని చురకలు వేసింది.
ద్వీపదేశం సెషల్స్ కొత్తగా ఏర్పాటు చేసిన ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజాన్’ను ఇటీవల ప్రధాని మోదీకి ఇచ్చి గౌరవించిన విషయం తెలిసిందే. దీనిపై ఆసిఫ్ ‘అది అడిగి తెచ్చుకున్న కృత్రిమ గుర్తింపు’ అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసూయ మహాచెడ్డదని, ఇతరులను ద్వేషించే వారికి ఇది ఎక్కువగా ఉంటుందని ఎద్దేవా చేసింది.
గత వారం సెషల్స్ దేశంలో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రధాని మోదీ చూపుతున్న నిబద్ధతకు, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లటానికి ఆయన చేస్తున్న కృషికిగాను ప్రస్తుత సెషల్స్ ప్రభుత్వం ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది.


