G20 Summit: ఇకపై జీ20 కాదు.. జీ21  | Sakshi
Sakshi News home page

G20 Summit: ఆఫ్రికా యూనియన్ చేరికతో జీ20 కాస్తా ఇకపై జీ21

Published Sat, Sep 9 2023 9:20 PM

G20 To Become G21 After African Union Inclusion - Sakshi

న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సదస్సులో ఆఫ్రికా యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన చేయగా సభ్యదేశాలు ఆమోదాన్ని తెలిపాయి. అనంతరం భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్‌పర్సన్ అజాలి అసోమానిని ఆయనకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో 20 సభ్యుల జీ20లో ఆఫ్రికా యూనియన్ చేరికతో 21 సభ్యులయ్యారు.

మొరాకోలో విషాదం.. 
18వ శిఖరాగ్ర జీ20 సమావేశాల్లో అతిధులకు స్వాగతం పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాగత సందేశంలో మొదట మొరాకోలో సంభవించిన భూకంపం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ బాధితులకు సానుభూతి తెలిపి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్‌ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. 

వెల్‌కమ్ ఆఫ్రికా..
అనంతరం 55 దేశాల సమూహమైన ఆఫ్రికా యూనియన్ వారికి జీ20లో శాశ్వత సభ్యత్వం విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించగా.. సభ్యదేశాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాయి. అనంతరం ప్రధాని మోదీ యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్  ఛైర్‌పర్సన్ అజాలి అసోమానిని జీ20 హై టేబుల్‌లో కూర్చోవాల్సిందిగా కోరారు. సభ్యదేశాల ప్రతినిధుల కరతాళధ్వనుల మధ్య భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అసోమానీని తన సీటు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

 

భారత్ చొరవ.. 
జీ20లో ఆఫ్రికా యూనియన్ దేశాల సభ్యత్వం విషయమై ప్రధాని మోదీ ఎంతో చొరవ చూపించారు. ఆఫ్రికా దేశాలకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కోరుతూ ఆయన జీ20 నాయకులకు గతంలో లేఖ రాశారు. జులైలో శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ముసాయిదా ప్రకటనలో ఈ ప్రతిపాదనను కూడా చేర్చారు. ఈరోజు సభ్య దేశాల ఆమోదంతో దాదాపు 130 కోట్ల జనాభా కలిగిన అఆఫ్రికా యూనియన్ దేశాలు జీ20 కూటమిలో చేరి ప్రపంచానికి మరింత చేరువైంది. 

ఇది కూడా చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌లో గొప్పేముంది? 

Advertisement
Advertisement