నేపాల్‌లో ప్రకృతి విలయం | Flood disaster in Nepal 28 people dead | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో ప్రకృతి విలయం

Oct 5 2025 1:43 PM | Updated on Oct 6 2025 4:42 AM

Flood disaster in Nepal 28 people dead

భారీ వర్షాలు, వరదలతో 51 మంది మృతి 

మరో 12 మంది జాడ గల్లంతు

కఠ్మాండు/న్యూఢిల్లీ: కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నేపాల్‌లో కనీసం 51 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో కొట్టుకుపోయిన కొందరి జాడ తెలియాల్సి ఉందని ఆదివారం ఉదయం అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో 114 మందిని సహాయక సిబ్బంది కాపాడారన్నారు. నేపాల్‌లోని ఏడు ప్రావిన్స్‌లకు గాను ఐదు ప్రావిన్స్‌ల పరిధిలో రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. 

దీంతో ప్రభుత్వం సోమవారం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. కోషి ప్రావిన్స్‌లోని ఇలమ్‌ జిల్లా ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా ప్రభావితమైంది. రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఈ జిల్లాలో 37 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఇలమ్‌లో కొండచరియ విరిగి ఓ నివాసంపై పడటంతో అందులో నిద్రిస్తున్న కుటుంబంలోని ఆరుగురు చనిపోయారని అధికారులు వివరించారు. ఖొటంగ్, రౌటహట్‌ జిల్లాల్లో పిడుగుపాటుకు ఐదుగురు బలయ్యారు. 

 

ఆదుకుంటాం: మోదీ
నేపాల్‌లో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై భారత ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మిత్ర దేశం నేపాల్‌కు ఎలాంటి అవసరము న్నా ముందుగా స్పందించి ఆదుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉంటుందని ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో నేపాల్‌ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement