పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు..ఎందుకో తెలుసా?

ప్రపంచంలో సమస్యాత్మక సరిహద్దులలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఒకటి. ఈ ప్రాంతంలో సైన్యం కాకుండా వేరేవారు కనపడితే ఇబ్బందుల్లో పడినట్లే. అయితే ప్రజలే కాదు జంతువులు, పక్షులు కూడా అనుమానాస్పదంగా కనపడినా అదుపులోకి తీసుకుంటారని ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సరిహద్దు నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ బోర్డర్ వద్ద కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ పావురం అతని భుజంపై వచ్చి వాలింది. ఈ ఘటన ఏప్రిల్ 17న జరిగింది.
ఆ పావురం కాళ్లకు ఏదో కట్టి ఉన్నట్లు గమనించిన కానిస్టేబుల్ అనుమానం వచ్చి వెంటనే పావురాన్ని పట్టుకుని, పోస్ట్ కమాండర్ ఒంపాల్ సింగ్కు సమాచారం ఇచ్చాడు. అనంతరం అధికారులు పావురాన్ని స్కాన్ చేశాడు. ఒక తెల్ల కాగితం కనిపించగా, దానిపై ఒక సంఖ్య కూడా ఉంది. ఇదేదో కోడ్ భాష లాంటిదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పావురాన్ని ఉగ్రవాదులు గూఢచర్యానికి ఉపయోగిస్తున్నారనే అనుమానంతో పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
( చదవండి: రష్యా సర్జికల్ స్ట్రైక్: 200 ఉగ్రవాదులు ఖతం )