దావూద్‌ గుట్టువిప్పిన పాకిస్తాన్‌ | Dawood Ibrahim lives in Karachi | Sakshi
Sakshi News home page

దావూద్‌ గుట్టువిప్పిన పాకిస్తాన్‌

Aug 22 2020 9:00 PM | Updated on Aug 22 2020 9:38 PM

Dawood Ibrahim  lives in Karachi - Sakshi

ఇస్లామాబాద్‌ : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్‌ ఎట్టకేలకు అంగీకరించింది. దావూద్‌ కరాచీలోనే ఉన్నట్టు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఆ దేశం తాజాగా ప్రకటించిన టెర్రరిస్టుల జాబితాలో ఆయన పేరును కూడా పొందుపరిచింది. తమ గడ్డపై ఉగ్రవాదులను గుర్తిస్తూ పాకిస్థాన్ ఓ జాబితాను విడుదల చేసింది. కరుడుగట్టిన నేరగాళ్లు హాఫిజ్ సయీద్, మొహమ్మద్ అజర్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు చెందిన 88 మంది వివాదాస్పద రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై వీరందరి మీద ఆంక్షలు విధించనుంది. బ్యాంక్ ఖాతాలను కూడా స్థంభింపచేయనుంది. 

ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించాలన్న అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్థాన్ ఈ జాబితానును శనివారం విడుదల చేసింది. దీంతో  ఉగ్రవాద కార్యక్రమాలను ఊపిరి పోస్తున్న దావూద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఉగ్రవాద గ్రూపులపై, నాయకులపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్నామని, స్థిర, చరాస్థులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, వారి బ్యాంకు ఖాతాలను సైతం స్తంభింపజేస్తామని స్పష్టం చేసింది. అయితే  గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఇదంతా ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టించడానికేనా అన్న అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.  కాగా, 1993 ముంబై పేలుళ్ల కేసులో కీలక సూత్రదారిగా ఉన్న దావూద్.. అప్పటి నుంచి పాకిస్తాన్‌లోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement