 
													వెల్లింగ్టన్: భూమి మీద నూకలు ఉండాలేగానీ ఆకాశం నుంచి పడ్డా నిక్షేపంగా ఉంటారనడానికి ప్రబల నిదర్శనమీ ఘటన. ఆశ్చర్యపరిచే ఈ ఘటన న్యూజిలాండ్లోని పర్వతసానువుల్లో శనివారం జరిగింది. నార్త్ ఐలాండ్లోని టరనకీ పర్వతంపైకి అధిరోహించేందుకు శనివారం పర్వతారోహకుల బృందం బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో 1,968 అడుగుల మేర ఎక్కాక ఓ పర్వతా రోహకుడు అనూహ్యంగా జారి పడిపోయాడు. అయితే, అతడికి స్వల్పంగానే గాయాలయ్యాయి. అక్కడి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో అతడు పడిన చోట మంచు మెత్తగా మారడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.
అతడు ప్రాణా లతో ఉండటం అద్భుతమైన విషయమని, అతడు చాలా అదృష్టవంతుడని పోలీసులు అంటున్నారు. న్యూజిలాండ్లోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో టరనాకీ ఒకటిగా పేర్కొంటారు. ఇదే ప్రాంతం నుంచి 2021లో ఇద్దరు పర్వతారోహకులు జారిపడి మృతి చెందారు. నార్త్ ఐలాండ్లోనే నిద్రాణ అగ్నిపర్వతం కూడా ఉంది. ఇతర పర్వతాల నుంచి వేరుపడినట్లుగా దూరంగా ఉండటం, తీరానికి సమీపంలో ఉండటం, వేగంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించడం వంటి పరిస్థితులు న్యూజిలాండ్లో టరనాకీ వద్దతప్ప మరెక్కడా లేవని మౌంటెన్ సేఫ్టీ కౌన్సిల్ పేర్కొంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
