China Praises India For Helping Sri Lanka, Says South Asia Remains Priority - Sakshi
Sakshi News home page

శభాష్‌ భారత్‌.. మోదీ సర్కార్‌పై చైనా ప్రశంసలు

Jun 9 2022 6:48 PM | Updated on Jun 9 2022 7:19 PM

China Praises India For Helping Sri Lanka - Sakshi

(ఫైల్‌ఫోటో)

ఇటీవల కాలంలో భారత్‌, చైనా మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కానీ, కొన్ని సందర్భాల్లో భారత్‌పై చైనా ప్రశంసలు కురిపించింది. కొద్దిరోజుల క్రితం.. గోధుమల ఎగుమతులపై భారత్‌ నిర‍్ణయాన్ని స్వాగతిస్తూ జీ-7 దేశాలపై మండిపడ్డ చైనా.. మరోసారి ఇండియాను ప్రశంసించింది. 

వివరాల ప్రకారం.. ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన శ్రీలంకకు భారత్‌ ఆపన్న హస్తం అందించింది. డీజిల్‌, ఆహార ధాన్యాలను మోదీ సర్కార్‌ లంకకు పంపించింది. ఈ నేపథ్యంలో భారత్‌ అందిస్తున్న సహాయ సహకారాలను డ్రాగన్‌ కంట్రీ చైనా మెచ్చుకుంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్‌ మాట్లాడుతూ.. శ్రీలంక విషయంలో భారత ప్రభుత్వం అందించిన సాయం ప్రశంసనీయం. భారత్‌ ప్రయత్నాలను చైనా అభినందిస్తోంది. శ్రీలంక, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు వీలైనంత తర్వగా కష్టాల నుంచి బయటపడేందుకు సహాయం చేయడానికి భారత్‌, ఇతర అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని స‍్పష్టం చేశారు. 

ఇక, లంక విషయంలో చైనా కూడా తమ వంతు కృషి చేస్తోందని తెలిపారు. శ్రీలంకకు సాయం అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తోందని చెప్పారు. చైనా సామర్థ్యం మేరకు శ్రీలంక సామాజిక ఆర్థిక అభివృద్ధికి మద్దతిచ్చాం. శ్రీలంక కోసం 500 మిలియన్ విలువైన అత్యవసర మానవతా సహాయాన్ని చైనా ప్రకటించిందని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. చైనా సాయం విషయంలో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆవేదన వ్యక్తం చేశారు. లంక కోసం ఒక బిలియన్ డాలర్ల రుణం కోసం చైనాకు చేసిన అభ్యర్థనను ఆ దేశం పట్టించుకోలేదని అన్నారు. అలాగే, చైనా నుంచి 1.5 బిలియన్‌ డాలర్ల క్రెడిట్ లైన్‌ను శ్రీలంక పొందలేకపోయిందని తెలిపారు.

ఇది కూడా చదవండి: వంతెన ఓపెనింగ్‌లో విషాదం.. అధికారుల బొక్కలు విరిగాయి.. వీడియో

Advertisement
 
Advertisement
Advertisement