టెహ్రాన్: అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల వేళ చైనా..ఇరాన్ కొంప ముంచింది. అణు చర్చల తర్వాత ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులకు తెగబడ్డాయి. ప్రతి చర్యగా ఇరాన్ ఇటీవల చైనా నుంచి తెచ్చుకున్న హెచ్-9బీ (HQ-9B)ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (SAM) వ్యవస్థను ఉపయోగించింది. అయితే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విఫలమైంది. తద్వారా ఇరాన్లో భారీ ఆస్తినష్టం, ప్రాణం నష్టం జరిగినట్లు సమాచారం.
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది క్షిపణుల ఆధారిత రక్షణ కవచం. నేల మీద గాని, నౌకల మీద గాని ఏర్పాటు చేసి, ప్రత్యర్థి విమానాలు లేదా క్షిపణులను గగనతలంలోనే కూల్చివేయడం దీని పని. ఇరాన్ శత్రు దేశాల నుంచి సురక్షితంగా ఉండేలా చైనా నుంచి ఆయిల్ ఫర్ వెపన్ ఒప్పందం కింద హెచ్క్యూ-9బీని తెచ్చుకుంది. గతేడాది ఇజ్రాయెల్ దాడుల సమయంలో రష్యా తయారు చేసిన ఎస్-300పీఎంయూ-2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిగా పనిచేయలేదు. అందుకు అప్గ్రేడ్గా ఈసారి రష్యా నుంచి కాకుండా చైనా నుంచి ఎయిర్ డిఫెన్స్ దిగుమతి చేసుకుంది. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల వేళ ఇరాన్ హెచ్క్యూ-9బీని ఉపయోగించింది. కానీ ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థ విఫలమైంది.
ఇరాన్లో నాటంజ్ అణు కేంద్రం,ఫోర్డో ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, ఐఆర్సీజీ మిసైల్,యూఏవీ బేస్లు, అలాగే టెహ్రాన్, ఇస్ఫహాన్ సమీపంలో ఎయిర్బేసులు ఉన్నాయి. ఆ ఎయిర్బేస్లపై శత్రు దాడుల నుంచి రక్షించేలా హెచ్-9బీ ఎయిర్ డిఫెన్స్ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎస్-300పీఎంయూ-2, బావర్-373, ఖోర్దాద్-15,రాద్, టోర్-ఎం2, పాంటిసిర్-ఎస్1 వంటి ఇతర రక్షణ వ్యవస్థల్ని మోహరించింది.
అయితే అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అణుకేంద్రాలను రక్షించడంలో హెచ్క్యూ-9బీ ఆధారిత రక్షణ పూర్తిగా విఫలమైంది. 31 ప్రావిన్స్లో 20కి పైగా ప్రాంతాలు అమెరికా,ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్ర ప్రభావితమయ్యాయి.
ఒక్క ఇరాన్ మాత్రమే కాదు..గతంలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ను తిప్పికొట్టేలా చైనా నుంచి పాకిస్థాన్ తెచ్చుకున్న హెచ్క్యూ-9బీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తేలిపోయింది. ఇప్పుడు ఇరాన్లో సైతం చైనా డిఫెన్స్ ఎయిర్ సిస్టం విఫలం కావడంతో ప్రపంచ దేశాల ఎదుట చైనా భంగపాటుకు గురైంది.


