ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. ఒక దేశ సుప్రీం లీడర్ను ఆయన దేశంలోనే అంత మెుందించడంతో మహాసంగ్రామానికి తెరలేసింది. ఒవైపేమో ఇజ్రాయెల్, అమెరికా దాడులు వాటికి ప్రతిగా ఇరాన్ సైతం విరుచుకపడుతుండడంతో మూడో ప్రపంచయుద్ధం ఆరంభం కానుందా అనే టెన్షన్ ప్రపంచ దేశాల్లో నెలకొంది. ఇదిలా ఉండగా సుప్రీం లీడర్ మృతితో ఆయనకు చెందిన లక్షల కోట్ల ఆస్తుల పరిస్థితి ఏంటా అనే చర్చ మెుదలైంది.
ప్రస్తుతం ఇరాన్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యతో ఆ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. ఆయన మృతి కేవలం ఇరాన్కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్ షియా ముస్లిం వర్గానికి తీరని లోటుగా భావిస్తున్నారు. 1939లో మషద్లోని ఒక సాంప్రదాయ మతపరమైన కుటుంబంలో ఖమేనీ జన్మించారు. అనంతరం 1979లో జరిగిన నాటి ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించి అప్పటి షా మహమ్మద్ రెజా పహ్లావీని కూల దోయడంలో కీలకంగా వ్యవహారించారు. అనంతరం ఆదేశ అధ్యక్షుడిగా, సుప్రీం లీడర్ గా ఎదిగారు.
అయితే అనంతర కాలంలో ఇరాన్లో తిరుగులేని శక్తిగా ఆయతుల్లా ఖమేనీ వ్యవహారించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్ని శాసించడంతో పాటు మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, రక్షణ రంగాలను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో ఆయతుల్లా ఖమేనీ పెద్దమెుత్తంలో ఆస్తులు సైతం సంపాదించినట్లు సమాచారం. ఖమేనీ ఆస్తుల విలువ 2013లో వచ్చిన ఓ పత్రికా కథనం ప్రకారం 93 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 9 లక్షల కోట్లు అది ప్రస్తుత లెక్కల ప్రకారం మరింతగా పెరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వీటి పరిస్థితి ఎంటా అని తెలియాల్సి ఉంది. అయితే ఆయన కుమారుడికి సైతం పెద్ద మెుత్తంలో ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
అయితే ఖమేనీ మృతితో ఆయన స్థానంలో తాత్కాలిక సుప్రీం లీడర్గా ఆయతుల్లా అలిరెజా అరాఫీని ఇరాన్ ఎన్నుకుంది. ఇదివరకూ ఇరాన్ సెమిసరీ సిస్టమ్ అధిపతిగా పనిచేసిన అలిరెజా అరాఫీని సుప్రీంగా ఎన్నుకున్నారు. కాగా ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ పై విరుచుకపడుతుంది. తన సమీప దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడుతుంది. టెహ్రాన్పైనా ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్త దాడులు జరుపుతున్నాయి.


