వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్‌ గేట్స్‌

Bill And Melinda Gates End 27 Years Of Marriage Announced On Twitter - Sakshi

వాషింగ్టన్‌: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సంచలన ప్రకటన చేశారు. మిలిందా గేట్స్‌తో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, అయితే సామాజిక కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే కొనసాగుతామని స్పష్టం చేశారు.  బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  ఈ మేరకు సతీమణి మిలిందా గేట్స్‌తో కలిసి ట్విటర్‌ వేదికగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 

27 ఏళ్ల బంధం ఇక ముగిసింది..
‘‘మా బంధం కొనసాగాలా లేదా అన్న అంశం గురించి పూర్తిగా ఆలోచించిన తర్వాత విడిపోవాలనే నిర్ణయానికివచ్చాం. గత 27 ఏళ్ల బంధంలో ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశాం. ఫౌండేషన్‌ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఆరోగ్యవంతులుగా, మెరుగైన జీవనం గడిపేలా మా వంతు కృషి​ చేశాం. ఈ మిషన్‌ ఇలాగే కొనసాగిస్తాం. ఫౌండేషన్‌ కోసం కలిసి పనిచేస్తాం. అయితే, మా జీవితంలోని తదుపరి దశలో దంపతులుగా మాత్రం కొనసాగలేం. దయచేసి కొత్త జీవితం ప్రారంభించబోతున్న మాకు, మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మనవి’’ అని మిలిందా, బిల్‌ గేట్స్‌ విజ్ఞప్తి చేశారు.

సంపదలో కుబేరులు.. మానవత్వంలోనూ
స్కూల్‌ ఫ్రెండ్‌ పాల్‌ అలెన్‌తో కలిసి 1975లో బిల్‌ గేట్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ సంస్థ మెరుగైన ఫలితాలను సాధించింది. 1986లో పబ్లిక్‌ ఆఫరింగ్‌కు వచ్చిననాటికి అందులో గేట్స్‌ వాటా 49%. బ్లూమ్‌బర్గ్‌ తాజా నివేదిక ప్రకారం బిల్‌ గేట్స్‌ సంపద ప్రస్తుతం 124 బిలియన్‌ డాలర్లు. కాగా 1970లో ప్రారంభమైన మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు  అయిన ఆయన.. 1987లో తొలిసారిగా ప్రపంచ సంపన్నుడిగా ఫోర్బ్‌ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 24 ఏళ్ల పాటు అదే స్థానంలో కొనసాగారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.

అలా మొదలైంది
ఇక 1987లో మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా జాయిన్‌ అయిన మిలిందా, అదే ఏడాదిలో ఓ డిన్నర్‌ పార్టీలో బిల్‌ గేట్స్‌ను కలిశారు. ఈ క్రమంలో డేటింగ్‌ ప్రారంభించిన ఈ జంట.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  వారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కుమారుడు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయస్సు 65 ఏళ్లు కాగా, మిలిందా వయస్సు 56 ఏళ్లు

ఫౌండేషన్‌ స్థాపించి..
గేట్స్‌ దంపతులు 2000లో సియాటిల్‌లో బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ స్థాపించి సామాజిక సేవలో భాగమయ్యారు.  ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో మానవీయ కార్యక్రమాల నిర్వహణ కోసం కోట్లాది డాలర్లను విరాళాలుగా ఇవ్వడం ప్రారంభించారు. ప్రధానంగా ప్రజారోగ్యం, విద్య తదితర అంశాలపై దృష్టి సారించి ఎంతో మందికి సాయం చేశారు. పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం, మహిళా సాధికారికతకై తమ వంతు కృషి చేశారు. అంతేకాదు కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధికై ఈ ఫౌండేషన్‌ 1.75 బిలియన్‌ డాలర్ల గ్రాంట్లు విడుదల చేసింది. తద్వారా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది.  కాగా 2018 వరకు బిల్, మిలిందా గేట్స్‌ ఈ ఫౌండేషన్‌కు సుమారు 36 బిలియన్‌ డాలర్లను సమకూర్చారు. 2006 నుంచి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌ 29 బిలియన్‌ డాలర్లను ఈ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top