● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
● బండ్లగూడ పరిధిలో విషాదం
చాంద్రాయణగుట్ట: రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి చెందిన ఘటన బండ్లగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీరాబాద్కు చెందిన వాచింగ్ మిషన్ టెక్నీషియన్ మహ్మద్ ఆమేర్ (26), ఫాతిమా బేగం (22)కు మూడు నెలల క్రితం వివాహమైంది. గురువారం అర్ధరాత్రి ఈ దంపతులు తమ ఆడపడచు పిల్లలు షేక్ సులేమాన్ (9), నౌషిన్ బేగం(11)లతో కలిసి బండ్లగూడలోని బంధువుల శుభకార్యానికి హాజరై జహంగీరాబాద్కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. హాషామాబాద్ యూటర్న్ వద్ద ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్కు చెందిన జితేందర్ కుమార్ (22) లారీతో వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఫాతిమా లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పిల్లలు షేక్ సులేమాన్, నౌషిన్ బేగం, ఆమేర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి చెందిన విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.


