
మియాపూర్లో లారీ బీభత్సం
హోంగార్డు మృతి
● మరో ఇద్దరికి గాయాలు
మియాపూర్: మద్యం మత్తులో వాహనం నడిపి ట్రాఫిక్ హోంగార్డు మృతికి కారణమయ్యాడు ఓ లారీ డ్రైవర్. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రాజవర్ధన్, వికేందర్, సింహాచలం (42) విధుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఎర్రగడ్డ నుంచి మియాపూర్ వైపు మద్యం మత్తులో లారీ నడుపుతూ వచ్చిన డ్రైవర్.. యూటర్న్ వద్ద ఉన్న ట్రాఫిక్ గొడుగును ఢీకొట్టాడు. పక్కన విధులు నిర్వర్తిస్తున్న సింహాచలంపై ట్రాఫిక్ గొడుగు పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతనితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రాజవర్ధన్, వికేందర్లకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరిశీలించి సింహాచలం అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. రాజవర్ధన్, వికేందర్లు చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం చింతల్కట్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ శ్రీనివాస్ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా 321 యూనిట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. మృతుడు సింహాచలం స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా చిగురువలస గ్రామం. నగరంలోని బాచుపల్లి బొల్లారంలో భార్య కుమారి, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసముంటున్నాడు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రెండేళ్ల నుంచి హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
‘హై సిటీ’ ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో కేబీఆర్ పార్కు చుట్టూ, ఇతరత్రా ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి, ఫ్లై ఓవర్లు తదితర నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.7032 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసి ఎంతో కాలమైంది. కానీ.. ఇప్పటి వరకు సదరు పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఇంకా టెండర్ల దశ కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో టెండర్లు పూర్తి కాగానే ఎంపికయ్యే కాంట్రాక్టర్లకు పనుల నిమిత్తం స్థలాల్ని అప్పగించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరితంగా పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీలోని భూసేకరణ విభాగం అడిషనల్ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు సంబంధిత టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు విభాగాల్లోని సిబ్బంది సమన్వయంతో పని చేసి భూసేకరణలు త్వరితంగా పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో ప్రాజెక్టుల విభాగం సీఈ భాస్కర్రెడ్డి, అడిషనల్ సీసీపీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇకనుంచి ప్రతివారం సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో శిల్పా లేఔట్ ఫేజ్–2, నల్లగొండ క్రాస్రోడ్ ఫ్లై ఓవర్, ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ర్యాంప్, శాస్త్రిపురం ఆర్యూబీల పనులపై కూడా సమీక్షించారు. వాటిని కూడా వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మియాపూర్లో లారీ బీభత్సం