ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
హన్మకొండ అర్బన్: వినాయక చవితి, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి సంబంధిత అధికారులతో నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. నిమజ్జనానికి అనువైన చెరువులు, నీటి వనరులను ముందుగానే గుర్తించి అవసరమైన చోట నిమజ్జన పాండ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, మండపాల వద్ద విద్యుత్ వైరింగ్ను ముందుగానే తనిఖీ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో నిమజ్జన సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ప్రతిష్ఠించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, రెడ్క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్రావు, జీడబ్ల్యూఎంసీ, పట్టణ ప్రణాళిక, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య, ట్రాఫిక్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


